ఈసారి ఏ వేదికల్లో ఐపీఎల్ జరగబోతోంది...?
ఈసారి ఏ వేదికల్లో ఐపీఎల్ జరగబోతోంది? బీసీసీఐ నిర్ణయం ఫ్రాంచైజీలకు కోపం తెప్పిస్తోందా? ఈ సారి కొన్ని ఫ్రాంచైజీలు తమ సొంత స్టేడియాలను వదులుకొవాల్సిందేనా?
గతేడాది కరోనా కారణంగా తటస్థ వేదికైన యూఏఈలో ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. పూర్తిగా బయో బబుల్లో జరిగిన ఐపీఎల్ సీజన్-13ని బీసీసీఐ విజయవంతం చేసింది. కానీ ఐపీఎల్ సీజన్-14ని భారత్లోనే నిర్వహించేందుకు సిద్ధమైంది బీసీసీఐ. ఆటగాళ్ల వేలం ఇప్పటికే పూర్తైంది. అయితే ఈసారి ఐపీఎల్ మ్యాచులను ఏ వేదిక మీద నిర్వహిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
త్వరలో జరగబోతున్న ఐపీఎల్ వేదికలను బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇన్నాళ్లు ఫ్రాంచైజీ ఉన్న ప్రతి జట్టు తమ సొంత స్టేడియాల్లో మ్యాచులు ఆడడం ఆనవాయతీ. కానీ ఈసారి బీసీసీఐ రూటు మార్చినట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ సీజన్ను నాలుగు నగరాలకే పరిమితం చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. లీగ్ దశ మ్యాచ్లను చెన్నై, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీలో నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ.. ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్లను మాత్రం అహ్మదాబాద్లోని మోతేరాలో జరపాలని ప్లాన్ చేస్తోంది. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముంబైలో ఐపీఎల్ వద్దని భావిస్తోందట బీసీసీఐ.
అయితే ఈ వేదికలపై సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. బీసీసీఐ నిర్ణయం తమ జట్లకు ప్రతికూలం అవుతుందని చెబుతున్నాయి. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని.. గతేడాది యూఏఈలో టోర్నీ నిర్వహించిన విషయాన్ని బీసీసీఐ గుర్తు చేస్తోంది. యూఏఈ తటస్థ వేదిక కాబట్టి అన్ని జట్లకూ మైదానాలు సమానమేనని.. ఇక్కడ మాత్రం పరిస్థితి వేరని ఫ్రాంఛైజీలు బీసీసీఐని తప్పుబడుతున్నాయి. వ్యాపారపరంగానూ నష్టం వస్తుందని వాదిస్తున్నాయి. బీసీసీఐ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని టీమ్ యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఏ జట్టూ లేని అహ్మదాబాద్కు అవకాశం కల్పించి.. హైదరాబాద్, రాజస్థాన్, పంజాబ్లో మ్యాచ్లకు అవకాశం ఇవ్వకపోవడంపై రాజకీయంగానూ స్పందనలు వస్తున్నాయి. హైదరాబాద్లో మ్యాచ్ల నిర్వహణకు తెలంగాణ సర్కార్ నుంచి పూర్తి సహకారం ఉంటుందని బీసీసీఐకి స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. తమ నిర్ణయం మార్చుకోవాలని కోరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ కూడా కేటీఆర్కు మద్దతు పలికారు.
పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సైతం ఐపీఎల్ వేదికల వ్యవహారంపై స్పందించారు. ఐపీఎల్ 2021 ఎడిషన్ వేదికల్లో మొహాలీ లేకపోవడం చూసి తాను ఆశ్చర్యానికి గురయ్యాయని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. ఐపీఎల్ నిర్వహణకు తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని.. మొహలీలో మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. మొత్తంగా ఐపీఎల్ వేదికల వ్యవహరం రాజకీయంగా వివాదం రాజేస్తోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)