తీరం దాటిన నివర్ తుఫాన్...
ఊహించినట్టుగానే అతి తీవ్ర తుఫాన్గా మారి... పుదుచ్చేరికి 30 కిలోమీటర్ల దూరంలోని మరక్కణం దగ్గర తీరాన్ని దాటింది... నివర్. నిన్న రాత్రి 11 గంటలు దాటాక తుఫాన్ తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున రెండు గంటలు దాటాక... పూర్తిగా తీరాన్ని దాటిందని ప్రకటించింది. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులు... భారీ విధ్వంసాన్నే సృష్టించాయి.
తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు హోర్డింగ్స్, బారికేడ్లు కొట్టుకుపోయాయి. హోర్డింగ్లు, కరెంటు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. పూరిళ్లు, రేకుల షెడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైతో పాటు కడలూరు, వెల్లూరు, విల్లుపురం, కాంచీపురం, చెంగల్పట్టు సహా మొత్తం 13 జిల్లాల్లో ఇవాళ సెలవు ప్రకటించారు. చెన్నైకి తాగునీరు అందించే చెంబరంబాక్కం ప్రధాన చెరువులో నీటి మట్టం పెరగడంతో, వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. చెన్నై నుంచి వెళ్లే 26 విమానాలను రద్దుచేశారు. అలాగే, కోయంబత్తూరు, బెంగళూరు వెళ్లే పలు రైలు సర్వీసులను కూడా నిలిపివేశారు. నివర్ ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజల్ని సహాయ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇటీవలి వర్షాలకు ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు... తుఫాన్ వర్షాలకు గండ్లు పడే అవకాశం ఉండటంతో... అలాంటి చోట్ల అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది... ప్రభుత్వం. ఈదురు గాలులకు కరెంటు స్తంభాలు, చెట్లు కూలిపోతే వాటిని తక్షణం తొలగించేందుకు సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయి. కరెంట్ పోయినా.. వెంటనే సరఫరా పునరుద్దరించేలా చర్యలు తీసుకున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)