ఈఎస్ఐ స్కామ్: వెలుగులోకి ప్రైవేట్ ఆస్పత్రుల దందా
సంచలన సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కామ్లో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో ప్రైవేట్ ఆస్పత్రుల పాత్ర బయటపడుతోంది. పలు ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కై.. ఈఎస్ఐ సిబ్బంది అవినీతికి పాల్పడినట్టుగా ఏసీబీ విచారణలో తేలింది. డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఆరుగురిని రెండురోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు... సమగ్రంగా విచారణ జరిపారు. పటాన్చెరు, చర్లపల్లి, వనస్థలిపురం, ఆర్సీపురం డిస్పెన్సరీ మందుల విక్రయాల్లో ఈ అక్రమాలు జరిగినట్టుగా ఏసీబీ విచారణలో బయటపడింది.
ఓమీ ఫార్మాతో పాటు ఇద్దరు జాయింట్ డైరెక్టర్స్ పద్మ, వసంత, ఫార్మాసిట్స్ రాధిక.. అన్ని విషయాలను ఏసీబీ అధికారుల ముందు పెట్టారు. కొనుగోలు చేసిన మెడిసిన్స్ను డిస్పెన్సరీలకు పంపించి.. అక్కడి నుంచి కార్మికులకు ఇచ్చినట్టుగా చూపించారు అక్రమార్కులు. తద్వారా ఈ మందులను దొడ్డిదారిన ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ఇలా ప్రతీ డిస్పెన్సరీ పరిధిలో నాలుగు పెద్ద ఆస్పత్రులకు ఈఎస్ఐ మందులను సరఫరా చేసినట్టు ఏసీబీ విచారణలో వెలుగుచూసింది. అక్రమంగా ఈఎస్ఐ మందులు కొనుగోలు చేసిన ప్రైవేట్ ఆస్పత్రులపై కూడా కేసులు నమోదు చేయాలని ఆలోచనలో ఉంది ఏసీబీ.. దీనిపై ఇప్పటికే జాబితా కూడా సిద్ధం చేసింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)