మంత్రి వెల్లంపల్లి వ్యవహారశైలి పై జగన్ సీరియస్ గా ఉన్నారా ?
పాపులారిటీ కోసం ప్రయత్నించారో ఏమో వెనకా ముందు ఆలోచించకుండా నోటికి పనిచెప్పేశారు ఆ మంత్రిగారు. ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చేలా ఉందని తెలియడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇంతకీ ఎవరా అమాత్యుడు? ఏంటా కథ?
సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారా?
వెలంపల్లి శ్రీనివాస్. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏ శాఖపైనా రానన్ని విమర్శలు దేవాదాయశాఖపై వస్తున్నాయి. అంతేస్థాయిలో ప్రచారం.. చర్చ జరుగుతోంది. ఏపీలోని ఆలయాలపై వరస దాడులు.. ఉద్రిక్త పరిస్థితులకు వెలంపల్లిని కార్నర్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇలాంటి ప్రతికూల సమయంలో తన పనితీరుతో ప్రభుత్వాన్ని గట్టెక్కించాల్సిన మంత్రి.. తాను ఇరకాటంలో పడటమే కాకుండా స్వపక్షాన్ని కూడా ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారా? వరస వివాదాలతో ఫస్ట్రేషన్లోకి వెళ్లి.. సంయమనం కోల్పోతున్నారా? ఏం మాట్లాడుతున్నారో? ఏం మాట్లాడాలో సరైన హోంవర్క్ చేయడం లేదా? ఇష్టారీతిన నోటికి పనిచెప్పి కొత్త సమస్యలను కోరి నెత్తిన పెట్టుకుంటున్నారా? ఈ వ్యవహారంపై పెద్దాయన సీరియస్గా ఉన్నారా? పిలిచి వార్నింగ్ ఇస్తారా.. క్లాస్ తీసుకుంటారా? ఈ అంశాలపై అధికార పార్టీ వర్గాల్లో ఓ రేంజ్లో చర్చ జరుగుతోందట.
సున్నితమైన అంశాన్ని సరిగా డీల్ చేయడం లేదా?
దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న వెలంపల్లి.. తన శాఖకు తగ్గట్టుగానే పద్ధతిగా ఉండాలని.. ఆ శాఖకు తగిన విధంగా వ్యవహారశైలి ఉండాలని అధికార పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట. వరస వివాదాలు ముసురుతున్న సమయంలో ఆయన అవేమీ పట్టించుకోవడం లేదని సమాచారం. దేవాలయాలపై దాడుల అంశంలో ప్రభుత్వం ఇరుకున పడుతోంది. ఈ దాడుల్లో టీడీపీ, బీజేపీ వాళ్ల హస్తం ఉందని స్వయంగా DGP గౌతం సవాంగ్ వెల్లడించారు. ఇంత సున్నితమైన అంశాన్ని వెలంపల్లి సరిగా డీల్ చేయలేకపోతున్నారనే టాక్ ఇప్పటికే క్యాంప్ ఆఫీస్ వర్గాల్లో తిరుగుతోందట.
అశోక్గజపతిరాజుపై చేసిన కామెంట్స్తో మరింత ఇరకాటం!
ప్రతిపక్షాల దాడి ఎక్కువైందన్న ఫస్ట్రేషనో.. సమస్యను సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నామన్న భావనో.. మాటల్లో వాడి పెంచకపోతే పాపులారిటీ రాదన్న లాజిక్కో కానీ ఈ మధ్య నోటికి బాగా పనిచెబుతున్నారు వెలంపల్లి. రామతీర్థం ఘటనలో టీడీపీ సీనియర్ నేత అశోక్గజపతిరాజును పట్టుకుని చెడామడా తిట్టేశారు. దీంతో క్షత్రియ సామాజికవర్గాలకు ఆయన టార్గెట్ అయ్యారు. మంత్రి వెలంపల్లికి వ్యతిరేకంగా ఆయా సంఘాల ప్రతినిధులు ఆందోళనలు చేశారు.. మంత్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అశోక్ గజపతిరాజు విషయంలో లౌక్యంగా వెళ్లకుండా వెలంపల్లి ఎంచుకున్న మార్గంపై కొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు.
సోము వీర్రాజు అండ్ టీమ్ను చెడామడా తిట్టేశారు!
అశోక్గజపతిరాజు ఎపిసోడ్లో వచ్చిన రియాక్షన్ రుచి చూసిన తర్వాత కూడా మంత్రి వెలంపల్లిలో మార్పు రాలేదట. పరిస్థితి సెట్ చేసుకోవాల్సిన ఆయన.. ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అండ్ టీమ్ను పట్టుకుని చెడామడా తిట్టేశారు. ఈ దఫా ఇంకాస్త డోసు పెంచి మాటలు వదిలేశారు. దేవాదాయశాఖ మంత్రి అంటే కాస్త పద్ధతిగా ఉంటారని.. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడతారని జనం అనుకుంటారు. ప్రస్తుత పరిణామాల తర్వాత ఆయనలో ఈ రెండూ కనిపించడ లేదట. ఈ అంశంపైనా అధికార పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోందట. అంతేకాదు.. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి పెద్దాయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి వస్తోందనే టాక్ నడుస్తోంది. మరి.. వెలంపల్లి లక్ ఎలా ఉందో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)