సురభివాణి గెలిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టేనా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిని బరిలో దింపిన టీఆర్ఎస్.. ఆమె గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతోందా? గులాబీ పార్టీ ఎందుకు ప్రత్యేకంగా గురిపెట్టింది? సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు స్వయంగా ప్రచారాన్ని పర్యవేక్షించడానికి కారణం ఉందా?
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానంపై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్!
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మునుపెన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ రణతంత్రం రచిస్తోంది. ఊహకందని విధంగా మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభివాణిని బరిలో దించినప్పటి నుంచి ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకుంటోంది గులాబీ పార్టీ. అంతేకాదు.. ఇక్కడి పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. స్వయంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్లు ఎప్పటికప్పుడు మూడు ఉమ్మడి జిల్లాల నేతలతో మాట్లాడుతున్నారు. ప్రచార సరళిని.. ఎన్నికల వ్యూహాన్ని స్వయంగా నిర్దేశిస్తూ.. ఆరా తీస్తున్నారు. ఈ పరిణామాలు అధికార పార్టీలోనూ.. వైరి పక్షాలలోను చర్చకు కారణం అవుతున్నాయి.
అభ్యర్థితో సంబంధం లేకుండానే ఎన్నికల వ్యూహం!
మూడు ఉమ్మడి జిల్లాలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జులుగా మంత్రులను నియమించారు సీఎం కేసీఆర్. నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల సన్నాహక సమావేశాలు జరిగేలా చొరవ తీసుకుంటున్నారు. అభ్యర్థి సురభి వాణితో సంబంధం లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించి.. టీఆర్ఎస్ గెలిచేలా పనిచేయాలని పార్టీ నేతలను, ప్రజా ప్రతినిధులను ఆదేశించారట గులాబీ బాస్. విపక్షాల విమర్శలను తిప్పికొట్టి.. బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని టీఆర్ఎస్ గట్టిగా కృషి చేస్తోంది.
ఒక గెలుపు అనేక ప్రశ్నలకు సమాధానమా?
పీవీ కుమార్తెకు ఓడిపోయే సీటు ఇచ్చారని ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అలాంటి విమర్శలను తిప్పికొట్టడంతోపాటు గెలిచి వైరిపక్షాలకు సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ ఆలోచిస్తోంది. ఈ దిశగానే అధికారపార్టీలో చర్చ కూడా జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ గెలుపు అనేక ప్రశ్నలకు.. అనుమానాలకు జవాబు ఇచ్చినట్టు అవుతుందని టీఆర్ఎస్ లెక్కలేసుకుంటోంది. అందుకే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ స్థానంపై ఫోకస్ పెట్టింది.
పీవీ కుమార్తె గెలిస్తే టీఆర్ఎస్కు రాజకీయంగా ప్లస్ అవుతుందా?
టీఆర్ఎస్ ఇప్పటి వరకు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవలేదు. కిందటి ఎన్నికల్లో ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ను బరిలో దించినా ఆశించిన ఫలితం రాలేదు. పైగా దుబ్బాక, GHMC ఎన్నికల తర్వాత బీజేపీ దూకుడుగా వెళ్తోంది. ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం. అందుకే బీజేపీకి చెక్ పెట్టాలంటే టీఆర్ఎస్ గెలవాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. అలాగే పీవీ కుమార్తెను శాసనమండలికి పంపితే పొలిటికల్గానూ మైలేజ్ సాధించవచ్చు. ఇప్పటికే పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ఏడాదిపాటు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో సురభివాణిని ఎమ్మెల్సీని చేస్తే అది టీఆర్ఎస్కు ప్లస్ అవుతుందనే లెక్కలు తెలంగాణ భవన్లో ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే కేసీఆర్, కేటీఆర్లు ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని భావిస్తున్నారు. మరి.. ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)